చెన్నై: వైద్య విద్య చదువుతున్న ఒక విద్యార్థి, అతడి ప్రియురాలు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన అతడు సుమారు 70 లక్షల ఖరీదైన లగ్జరీ కారును తగులబెట్టాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధర్మపురికి చెందిన 28 ఏళ్ల కవిన్ కాంచీపురంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య చదువుతున్నాడు. అదే కాలేజీలో చదివే మహిళతో కలిసి గురువారం సాయంత్రం తన మెర్సిడెస్ బెంజ్ కారులో రాజకులం గ్రామం వద్దకు వెళ్లాడు. అక్కడ వారిద్దరూ కారులో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కవిన్ ఆగ్రహంతో కారు నుంచి కిందకు దిగాడు. ఆ వెంటనే కారుకు నిప్పుపెట్టాడు.
మరోవైపు మంటల్లో కారు కాలిపోవడం చూసిన గ్రామస్తులు వెంటనే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేశారు. అయితే ఫైర్ ఇంజిన్ ఆ ప్రాంతానికి చేరుకునేలోపు సుమారు 70 లక్షల ఖరీదైన ఆ లగ్జరీ కారు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.