భువనేశ్వర్ : నాటు సారా సేవించిన ఏనుగులు మత్తులో జోగుతూ గంటల తరబడి నిద్రించిన ఘటన ఒడిషాలోని అటవీ ప్రాంతంలో వెలుగుచూసింది. మద్యం తయారు చేసేందుకు సమీప గ్రామానికి చెందిన ప్రజలు అడవిలోకి రాగా అప్పటికే మద్యం తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన నీటిని తాగిన ఏనుగుల గుంపు నిద్రిస్తూ కనిపించింది.
కెంజార్ జిల్లాలోని శిలిపద క్యాష్యూ ఫారెస్ట్ సమీపంలో నివసించే గ్రామస్తులు మహువా (మద్యం) తయారుచేసేందుకు అడవిలోకి వెళ్లగా పులియబెట్టేందుకు పెద్ద నీటి తొట్టెల్లో మహువ పూలను ఉంచిన ప్రాంతంలో 24 ఏనుగులు నిద్రలోకి జారుకున్న దృశ్యాలు కనిపించాయి. ఆ నీటిని తాగిన ఏనుగుల గుంపు మత్తులోకి జారుకుందని గ్రామస్తులు చెప్పారు. ఏనుగులను లేపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
మహువ తయారీకి తాము ఉదయం ఆరు గంటలకు అడవిలోకి వెళ్లగా కుండలన్నీ పగిలిఉన్నాయని, పులియబెట్టిన నీరు కనిపించలేదని స్ధానికులు తెలిపారు. అదే ప్రాంతంలో ఏనుగులు నిద్రిస్తూ కనిపించాయని చెప్పారు. ఏనుగులు పులియబెట్టిన నీటిని తాగాయని గ్రామస్తుడు నరియ సేథి పేర్కొన్నారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు ఏనుగుల గుంపును లేపేందుకు పెద్ద ఎత్తున డ్రమ్స్ మోగించారు. దీంతో ఏనుగులు అడవి లోపలికి పరిగెత్తాయని ఫారెస్ట్ రేంజర్ ఘసిరాం పాత్ర తెలిపారు.