ముంబై : ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతకు బుల్డోజర్లు దూసుకురాగా తాజాగా ముంబైలోనూ బుల్డోజర్లకు పని కల్పించారు. ముంబైలోని గొవండి ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూమిలో నిర్మించిన 215 అనధికార గుడిసెలను తొలగించేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చర్యలు చేపట్టింది.
ప్రైవేట్ భూమిలో అనధికారికంగా నిర్మాణాలు చేప్టటారనే ఫిర్యాదులు రావడంతో బీఎంసీ అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసింది. అనధికార నిర్మాణాల కూల్చివేతను ఆపి రక్షణ కల్పించాలని కోరుతూ నిర్వాసితులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బీఎంసీ దీటైన వాదనలతో ముందుకు రావడంతో కోర్టు పిటిషన్ను తోసిపుచ్చింది.
ఏప్రిల్ 30న అనధికార ఆక్రమణలను తొలగించేందుకు తుది నోటీసులు జారీ చేసిన బీఎంసీ అధికారులు తాజాగా గొవండి పోలీసుల భారీ భద్రత నడుమ బుల్డోజర్లతో ఆక్రమణలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించబోమని బీఎంసీ అధికారులు పేర్కొన్నారు.