పాట్నా: ఒక పోలీస్ అధికారి తుపాకీ కాల్పుల్లో గాయపడ్డాడు. (cop shoots self) ఆయన ఇంట్లో జరిగిన ఈ సంఘటనపై పోలీస్ అధికారులు రెండు కారణాలు వెల్లడించారు. పొరపాటున బుల్లెట్ తగలడంతో పోలీస్ అధికారి గాయపడినట్లు ఒకరు, డిప్రెషన్ వల్ల గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మరో అధికారి చెప్పారు. దీంతో ఇద్దరు పోలీస్ అధికారుల స్టేట్మెంట్లు భిన్నంగా ఉండటం వివాదానికి దారి తీసింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. ఇంట్లో ఉన్న ఎస్ఐ రష్మీ రంజన్కు బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే పోలీస్ స్టేషన్లో గన్ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో ఎస్ఐ రష్మీ రంజన్కు బుల్లెట్ గాయాలయ్యాయని ఎస్హెచ్వో బినోద్ పీటర్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత ఆయన తన కుటుంబంతో మాట్లాడారని చెప్పారు.
కాగా, ఎస్ఐ రంజన్ సొంత ఊరైన ఔరంగాబాద్లో నమోదైన కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందని, దీంతో డిప్రెషన్తో బాధపడుతున్న ఆయన గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సుశీల్ కుమార్ తెలిపారు. అయితే బుల్లెట్ గాయాలైన ఎస్ఐ రష్మీ రంజన్ ఆరోగ్య పరిస్థితి నిలడకగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
మరోవైపు ఎస్ఐ రష్మీ రంజన్కు బుల్లెట్ గాయాలు కావడంపై ఇద్దరు పోలీస్ అధికారులు రెండు రకాలుగా స్టేట్మెంట్లు ఇవ్వడంపై బీహార్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మండిపడింది. లాలూతో నితీష్ చేతులు కలిపినప్పటి నుంచి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం నైతిక స్థైర్యం అంతంత మాత్రంగానే ఉందని విమర్శించింది. పోలీసులు స్వతంత్రంగా దర్యాప్తు చేయకుండానే కట్టుకథలు చెబుతున్నారని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ ఆరోపించారు. సీఎం నితీశ్ కుమార్ ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని, దీంతో బాధితులు దేవుడి దయపై ఆధారపడి ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.