NISAR | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో కలిసి సింథటిక్ ఎపర్చార్ రాడార్ (NISAR) మిషన్పై కలిసి పని చేస్తున్నట్లు నాసా(NASA)కు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబోరేటరి (JPL) డైరెక్టర్ లారీ లెషిన్ తెలిపారు. మిషన్ను 2024లో ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆమె జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్పై ఇస్రోతో కలిసి సంయుక్తంగా కలిసి పని చేస్తుండడంపై సంతోషిస్తున్నామన్నారు. చంద్రయాన్-3 మిషన్ తర్వాత భారత్ అంతరిక్ష కార్యక్రమాలపై మరింత గౌరవం పెరిగిందన్నారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనల భవిష్యత్ ప్రణాళికలు తమను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని తెలిపారు.
నిసార్ మిషన్పై స్పందిస్తూ.. వాతావరణ మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి భూమి ఉపరితలం ఎలా మారుతుందో అవగాహన చాలా ముఖ్యమన్నారు. ఉపరితలంలో చిన్న చిన్న మార్పులను నిసార్ ద్వారా అర్థం చేసుకోవచ్చని.. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే మంచు ఫలకలు కరగడం, అడవులు, చిత్తడినేలలు, భూకంపాలు, అగ్నిపర్వతాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. భూ ఉపరితలంపై జరిగే మార్పులను వీక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు మార్పుల వెనుక ఉన్న భౌతికతను అర్థం చేసుకోవడంతో పాటు భవిష్యత్లో ఏం జరుగుబోతుందో అంచనా చేయవచ్చని పేర్కొన్నారు. నిసార్పై ఇస్రో, నాసా కలిసి పని చేస్తుండడంపై స్పందిస్తూ.. అంతరిక్ష పరిశోధన చరిత్రలో అతిపెద్ద సహకారమన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సహకారం, చర్చలపై ఉన్నత స్థాయి నాయకత్వం చూసుకుంటుందన్న ఆమె.. 30-40 మంది ఇంజినీర్లు బెంగళూరులో ఇస్రో సహోద్యోగులతో తొమ్మిది నెలలుగా భుజం భుజం కలిపి పని చేస్తున్నామన్నారు. ఇది ఎంతో ఉత్సాహకరంగా ఉందన్నారు. అద్భుతమైన సహకారం, మంచి టీమ్వర్క్తో పాటు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, బృందం చాలా బాగా కలిసి పని చేస్తోందన్నారు. నిసార్ శాటిలైట్ భూమిపై ప్రతి భాగాన్ని కనీసం 12 రోజులకోసారి పర్యవేక్షిస్తుంది. ఎర్త్ సైన్స్కు మించి భవిష్యత్తులో అన్ని రకాల విషయాలపై కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని లెషిన్ పేర్కొన్నారు. అన్ని రకాల విషయాల్లో కలిసి పని చేయానికి ఎదురుచూస్తున్నామని, ఇందులో చంద్రుడు, అంగారక గ్రహానికి సంబంధించిన భవిష్యత్ మిషన్లు ఉన్నాయని వివరించారు.