Farmers Protest | న్యూఢిల్లీ, మార్చి 9: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా ఇతర డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతు సంఘాలు ఆదివారం ‘రైల్ రోకో’ చేపట్టనున్నాయి. ఎస్కేఎం(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో జరుగనున్న ఈ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు సిద్ధమయ్యాయి.
రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ కేంద్రం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే బాధ్యత నుంచి తప్పించుకుపోవద్దని హితవు పలికారు. రైతులు మనుగడ సాధించాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ‘సీ2+50 శాతం’ విధానంలో అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేఎంఎం నేత శర్వాన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ రైల్ రోకోలో భాగంగా రైతులు పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తారని తెలిపారు.