ఇంఫాల్: మణిపూర్లో మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. గిరిజన మహిళలను మైతీలు నగ్నంగా ఊరేగించడం, వారిపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడం వంటి దారుణాలపై మిజోరంలోని మాజీ మిలెటెంట్ గ్రూప్ స్పందించింది. భద్రత దృష్ట్యా మైతీలు మిజోరం నుంచి వారి సొంత రాష్ట్రమైన మణిపూర్ (Manipur)కు వెళ్లిపోవాలని సూచించింది. మే 4న మణిపూర్లో జరిగిన అమానుష సంఘటనపై కుకీలకు అనుకూలంగా ఉన్న మిజో యువకులు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిజోరంలోని మైతీలపై దాడులు జరుగవచ్చని హెచ్చరించింది. ఈ మేరకు పీస్ అకార్డ్ MNF రిటర్నీస్ అసోసియేషన్ (PAMRA) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, మిజోరంలో ప్రభావవంతమైన సివిల్ సొసైటీ గ్రూప్, సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్ (CYMA) కూడా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న మైతీలకు ఇలాంటి సూచనలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత మిజోరంలోని మైతీల డేటా సేకరించే ప్రతిపాదనను మిజో స్టూడెంట్స్ యూనియన్ (MZU) నిలిపివేసింది.
మరోవైపు సుమారు రెండు వేల మంది మైతీ కుటుంబాలు, విద్యార్థులు మిజోరంలో నివసిస్తున్నారు. అయితే రాష్ట్రాన్ని వీడాలన్న సూచనలు, హెచ్చరికల నేపథ్యంలో మిజోరం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే మైతీలకు తగిన రక్షణ కల్పిస్తామని మిజోరం ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అయినప్పటికీ వందలాది మంది మైతీలు మిజోరం నుంచి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిజోరంను వీడుతున్న మైతీలను చార్టడ్ విమానాల్లో తరలించాలని మణిపూర్ ప్రభుత్వం యోచిస్తున్నది.