Kalyan Banerjee : అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల అనంతరం పశ్చిమబెంగాల్ (West Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలపై దాడుల పరంపర కొనసాగుతున్నది. టీఎంసీ నేతలపై వరుస దాడులు జరుగుతుండటం కలకలం రేపుతోంది. పార్టీ అగ్ర నేత, మమతాబెనర్జీ (Mamata Banerjee) మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishaik Banerjee) పై దాడి జరిగిన మరుసటి రోజే.. అంటే ఆదివారం ఉదయం మరో టీఎంసీ ఎంపీపై దాడి జరిగింది. ఆయన సొంత నియోజకవర్గంలోనే కొందరు ఆయనపై దాడికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే కొందరు ఆయన తలపై కొట్టారు. ఈ అనూహ్య పరిణామంతో ఆయన తల పట్టుకుని కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడికి ముందు కొందరు వ్యక్తులు కల్యాణ్ బెనర్జీకి నల్ల జెండాలు చూపిస్తూ ‘చోర్ చోర్’ (దొంగ దొంగ) అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్పూర్లో అభిషేక్ బెనర్జీ పర్యటనలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆయన పర్యటనలోనూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవగా ‘చోర్ చోర్’ అంటూ నినాదాలు చేశారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక టీఎంసీ నేతలపై ఒకే తరహాలో దాడులు, నిరసనలు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.