ముంబై: ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగిన ఆస్తి వివాదానికి కోర్టు ముగింపు పలికింది (Court Battle). రెండు ఫ్లాట్లకు వారసురాలైన 93 ఏళ్ల వృద్ధురాలికి వాటిని అప్పగించాలని తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 1942 మార్చి 28న నాటి డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం అప్పటి బ్రిటీష్ పాలకులు దక్షిణ ముంబైలోని రూబీ మాన్షన్ బిల్డింగ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం 1946 జూలైలో ఆ ప్రైవేట్ బిల్డింగ్ స్వాధీనం కోసం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించారు. దీంతో ఆ బిల్డింగ్లోని ఫ్లాట్లు వాటి యజమానులకు తిరిగి సొంతమయ్యాయి. అయితే రూబీ మాన్షన్ మొదటి అంతస్తులో ఉన్న రెండు ఫ్లాట్లను మాత్రం వాటి యజమానులకు అప్పగించలేదు. నాడు అందులో నివసించిన ప్రభుత్వ అధికారి డీఎస్ లౌడ్ వారసులు ప్రస్తుతం అందులో ఉంటున్నారు.
కాగా ఆ రెండు ఫ్లాట్ల వారసురాలైన ఆలిస్ డిసౌజా వాటి కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించారు. 80 ఏళ్ల నాటి ఈ ఆస్తి వివాదానికి కోర్టు ముగింపు ఇచ్చింది. ప్రస్తుతం 93 ఏళ్ల వయసున్న డిసౌజాకు ఆ రెండు ఫ్లాట్లు చెందుతాయని ద్విసభ్య ధర్మాసనం మే 4న తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం అందులో ఉంటున్న వారి నుంచి ఆ ఫ్లాట్లను స్వాధీనం చేసుకుని ఎనిమిది వారాల్లో అసలు వారసురాలైన ఆ వృద్ధురాలికి వాటిని అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.