తిరువనంతపురం : దేశంలో సంచలనం సృష్టించిన డిప్లొమాటిక్ పాస్ పోర్టుల ద్వారా యూఏఈ నుంచి కేరళకు భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా కేసులో 15 నెలలుగా జైలులో ఉంటున్న ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్కు ఊరట లభించింది. మంగళవారం కేరళ హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ యూఏపీఏ కింద కేసు నమోదు చేసింది.
బెయిల్పై విచారణ సందర్భంగా ఎన్ఐఏ బెయిల్ ఇవ్వొద్దని, నిందితురాలి బెయిల్ పిటిషన్ను కొట్టి వేయాలని అభ్యర్థించింది. ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్లోని ఆరోపణలు చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం (యూఏపీఏ)కు సంబంధం లేదని, ఆమెతో సంబంధం ఉన్న ఆధారాలను వెల్లడించలేదని స్వప్న సురేశ్ తరఫున న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ జయచంద్రన్లతో కూడిన డివిజన్ బెంచ్ పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే పీ మహ్మద్ షఫీ, ఏఎం జలాల్, రబిన్స్ హమీద్, రమీస్ కేటీ, షరాఫుదీన్ కేటీ, సరిత్ పీఎస్, మహ్మద్ అలీలకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25లక్షల పూచీకత్తు బాండ్ అందించాలని ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో దాదాపు 15 నెలలకుపైగా స్వప్న సురేశ్ జైలు శిక్ష అనుభవించారు. ఆమె ప్రస్తుతం తిరువనంతపురంలోని అట్టకులంగార మహిళా జైలు నుంచి విడుదలకానున్నారు.