గ్యాంగ్టక్: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా (Dalai Lama) టెన్జిన్ గ్యాట్సో 13 ఏళ్ల తర్వాత సిక్కింను సందర్శించారు. మూడు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు. తూర్పు సిక్కింలోని లిబింగ్ ఆర్మీ హెలిప్యాడ్ వద్ద ఉదయం 10.30 గంటలకు దలైలామా హెలికాప్టర్ నుంచి దిగారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆయనకు స్వాగతం పలికారు. పలువురు బౌద్ధులు సంప్రదాయ నృత్యాలు, ప్రార్థనలతో దలైలామాను ఆహ్వానించారు. ప్రవాస టిబెటన్ పాలకులు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దలైలామా గ్యాంగ్టక్లోని ఒక హోటల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రహదారికి ఇరువైపుల సిక్కిం ప్రజలు బారులు తీరారు. ఆయనను చూసేందుకు పోటీపడ్డారు.
కాగా, 87 ఏళ్ల దలైలామా, 37 బోధిసత్వ సాధనాలపై బోధనలు చేయనున్నారు. భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన నాథులాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు బౌద్ధ ప్రార్థనలు, బోధనలు నిర్వహిస్తారు. సుమారు 40,000 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దలైలామా ఆశీర్వాదం పొందనున్నారు.
మరోవైపు గ్యాంగ్టక్ జిల్లా సిమ్మిక్ ఖమ్డాంగ్ నియోజకవర్గంలో రుమ్టెక్, గ్యాల్వా లాట్సున్ చెన్పో విగ్రహం వద్ద కర్మప పార్క్ ప్రాజెక్టుకు దలైలామా వర్చువల్గా శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని సాలుగరాకు వెళ్తారని చెప్పారు.
కాగా, దలైలామా చివరిసారి సిక్కింను 2010లో సందర్శించారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో సిక్కింకు ఆయన రావాల్సి ఉంది. అయితే ఆకస్మిక వరదల్లో అనేక మంది ప్రజలు మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యాయి. ఈ నేపథ్యంలో దలైలామా సిక్కిం పర్యటన డిసెంబర్కు వాయిదా పడింది.