న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన శ్రద్ధా హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ కుటుంబం అదృశ్యమైనట్లు తెలుస్తున్నది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు నిందితుడి సొంతూరైన మహారాష్ట్రలోని వసాయ్కు వెళ్లారు. అతడి కుటుంబం గురించి ఆరా తీశారు. ఆ కుటుంబం నివాసం ఉండే యూనిక్ పార్క్ హౌసింగ్ సొసైటీకి వెళ్లారు. ఆఫ్తాబ్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో లేకపోవడంతో సొసైటీ సెక్రటరీ అబ్దుల్లా ఖాన్ స్టేట్మెంట్ను ఢిల్లీ పోలీసులు ఆదివారం రికార్డు చేశారు. ఆఫ్తాబ్ కుటుంబం 20 రోజుల కిందట తమ ఇంటిని ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఖాన్ తెలిపాడు. నాటి నుంచి వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెప్పాడు.
కాగా, వసాయ్లోని మానిక్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇద్దరితో కూడిన ఢిల్లీ పోలీస్ బృందం వసాయ్కు వచ్చిందని తెలిపారు. హతురాలు శ్రద్ధాకు సన్నిత స్నేహితుడైన లక్ష్మణ్ నాడార్ను మానిక్పూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం మూడు గంటలకుపైగా ప్రశ్నించినట్లు చెప్పారు. శ్రద్ధా మిస్సింగ్ గురించి ఆమె తండ్రి వికాస్ను తొలుత అతడే అప్రమత్తం చేశాడని, దీంతో ఆమె హత్య కేసులో కీలక సాక్షి అతడే అని వెల్లడించారు.