పంది మాంసంపై నిషేధం
బరేలీ, జూలై 26: ఇప్పటికే పలు రాష్ర్టాల్లో వెలుగుచూసిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉత్తరప్రదేశ్లోనూ కలకలం రేపింది. బరేలీ జిల్లా ఫరీద్పూర్లోని ఓ పందుల పెంపక కేంద్రంలో ఈ ఫీవర్తో 20 పందులు మరణించాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు పంది మాంసం అమ్మకంపై నిషేధం విధించడంతో పాటు పందుల మార్కెట్లను మూసివేయించారు.
చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ నివేదిక మేరకు జిల్లా కలెక్టర్ శివకాంత్ ద్వివేది మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటువ్యాధి అని, ఇది పందులకు ప్రాణాంతమని పేర్కొన్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ తరహా కేసులో ఇప్పటికే మిజోరాం, త్రిపుర, అస్సాం రాష్ర్టాల్లోనూ నమోదయ్యాయని వెటర్నరీ విభాగం అధికారి కేపీ సింగ్ పేర్కొన్నారు.