న్యూఢిల్లీ, జూలై 22: భారత గడ్డపై ఆఫ్రికన్ చిరుతలు (చీతాలు) కాలుమోపనున్నాయి. 69 ఏండ్ల కిందట దేశంలో కనుమరుగైన ఈ జంతువులు.. వచ్చే స్వాతంత్య్ర దినోత్సవంలోగా మన అడవుల్లో సంచరించనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికాతో ఎంవోయూ కుదుర్చుకొన్నది. దీని ప్రకారం నమీబియా 8 చిరుతలను భారత్కు అప్పగించనున్నది. అందులో నాలుగు మగ చిరుతలు, నాలుగు ఆడ చిరుతలు ఉండనున్నాయి.
దక్షిణాఫ్రికాతోనూ కేంద్ర ప్రభుత్వం 12 చిరుతల దిగుమతికి ఎంవోయూ కుదుర్చుకొన్నది. అయితే, నమీబియా నుంచి వచ్చే చిరుతలు ఆగస్టులో దేశానికి చేరుకొంటాయని అధికారులు తెలిపారు. వాటిని మధ్యప్రదేశ్లో షోపూర్ జిల్లాలోని కునో పల్పూర్ నేషనల్ పార్కులో వదులుతామని వెల్లడించారు. కాగా, ఏటా 8 నుంచి 10 చిరుతలను.. ఐదేండ్లలో మొత్తం 50 చిరుతలను భారత్కు దిగుమతి చేసుకొనేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది.
మన చిరుతలేవి?
బ్రిటిష్ కాలం వరకు దేశంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండేది. అయితే, క్రూరమృగాల వేట, ఆకలి దప్పికలతో భారత సంతతి మొత్తం అంతరించిపోయింది. అంటే.. గత 69 ఏండ్లలో చిరుతల ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు తీసుకొచ్చే చిరుతలు.. ఆఫ్రికన్ జాతికి చెందినవి.