న్యూఢిల్లీ, జూన్ 4: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రూ.43 వేల కోట్లతో ఆరు అత్యాధునిక సాంప్రదాయ ఏఐపీ జలాంతర్గాములను (సబ్మెరైన్లు) తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ (ఏఐపీ) ఆధారంగా ఇవి పనిచేస్తాయని వెల్లడించింది. ‘మేకిన్ ఇండియా’ పథకంలో భాగంగా ‘పీ-75 ఇండియా’ పేరుతో చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతులనిచ్చింది. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి (డీఏసీ) సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. విదేశీ సంస్థల సహకారంతో దేశీయంగా ఈ జలాంతర్గాములను తయారు చేయనున్నారు. ‘మేకిన్ ఇండియా’లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ప్రాజెక్టు.
ఏమిటీ ఈ ఏఐపీ జలాంతర్గాములు?
శత్రు దేశాల యుద్ధ నౌకలను, జలాంతర్గాములను నాశనం చేయడంలో అణ్వాయుధ జలాంతర్గాములు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే, కూలెంట్ వ్యవస్థ నిర్విరామంగా పనిచేయడంతో ఇవి పెద్దపెట్టున శబ్దాలు చేస్తాయి. దీంతో శత్రువులకు వీటి జాడ తెలిసిపోతుంది. సాంప్రదాయ జలాంతర్గాములు అంతగా శబ్దం చేయకపోయినప్పటికీ, బ్యాటరీ ఛార్జింగ్, వాతావరణంలోని ఆక్సిజన్ను నింపుకోవడానికి తరుచూ సముద్రం ఉపరితలానికి రావాల్సి ఉంటుంది. దీంతో శత్రువులు వీటి జాడను కూడా తెలుసుకోవచ్చు. అయితే, ఏఐపీ జలాంతర్గాములు డీజిల్-ఎలక్ట్రిక్ ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉంటాయి. దీంతో బ్యాటరీ ఛార్జింగ్, ఆక్సిజన్ను నింపుకోవడం వంటి అవసరాలను నీటి అడుగుభాగంలో ఉండగానే పూర్తిచేసుకోగలవు. శబ్దం కూడా చేయవు. దీంతో శత్రు జలాంతర్గాములు, శత్రు యుద్ధ నౌకల మధ్య తిరిగినప్పటికీ, వీటి ఉనికిని గుర్తించడం కష్టం. అందుకే వీటిని గూఢచారిగా పిలుస్తున్నారు.
ఇప్పుడే ఎందుకు?
దేశానికి కీలకమైన హిందూమహా సముద్ర ప్రాదేశిక జలాల్లో పట్టును సాధించేందుకు చైనా గతకొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నది. ఆ దేశ నావికా దళంలో 50 జలాంతర్గాములు (న్యూక్లియర్, నాన్-న్యూక్లియర్, ఏఐపీ), 350 యుద్ధ నౌకలు ఉన్నాయి. భవిష్యత్తులో గాల్వన్ తరహా ఘర్షణలు తలెత్తినప్పుడు ఆ దేశ నావికా దళాన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా ఆ స్థాయిలో సిద్ధమై ఉండాలి. అయితే, మన దగ్గర 15 సాంప్రదాయ జలాంతర్గాములు, రెండు అణ్వాయుధ జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఆరు ఏఐపీ జలాంతర్గాముల తయారీ నిర్ణయం తీసుకున్నది. రానున్న రోజుల్లో మరో 24 జలాంతర్గాములు, ఆరు అణ్వాయుధ జలాంతర్గాములను కొనుగోలు చేసేందుకు నేవీ సిద్ధమవుతున్నది.
ఎవరు తయారు చేయనున్నారు?
ఆరు ఏఐపీ జలాంతర్గాములను తయారు చేసేందుకు రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) పంపాలని లార్సెన్ & టర్బో (ఎల్&టీ), మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్)కు కేంద్రం సూచించింది. రష్యా, దక్షిణకొరియా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్కు చెందిన ఏదైనా ఒక సంస్థ సహకారంతో వీటిని తయారుచేయవచ్చని సూచించింది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి పన్నెండేండ్ల సమయం పట్టొచ్చని అధికారులు తెలిపారు.