న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అయిదు రాష్ట్రాల (యూపీ, ఉత్తరాఖండ్,మణిపూర్, పంజాబ్, గోవా) అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఖర్చు చేసిందని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం రాజకీయ పార్టీలన్నీ కలిపి ఆ ఎన్నికల్లో రూ 470 కోట్లు వెచ్చించగా కేవలం కాషాయ పార్టీయే ఏకంగా రూ 223 కోట్లు ఖర్చు చేసింది.
ఇదే సమయంలో బీజేపీకి రూ 914 కోట్ల నిధులు సమకూరాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ 102.65 కోట్లు ఖర్చు చేసి జాబితాలో రెండో స్ధానంలో నిలిచిందని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇక బీఎస్పీ రూ 69 కోట్లు ఖర్చు చేయగా యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 13 రాజకీయ పార్టీలకు రూ 1441.7 కోట్ల నిధులు సమకూరాయని ఆయా పార్టీలు మొత్తం రూ 470 కోట్లు ఖర్చు చేశాయని నివేదిక పేర్కొంది.
ప్రచార ఖర్చులు, రవాణా, ఇతర వ్యయాలు, అభ్యర్ధులకు సమకూర్చిన నిధులు, సోషల్ మీడియా వేదికలపై వెచ్చించిన ఖర్చులను రాజకీయ పార్టీలు తమ వ్యయాల కింద చూపాయి. రాజకీయ పార్టీలు వెల్లడించిన మొత్తం ఖర్చులో ప్రచారానికి 34 శాతం చూపగా, ఇతర ఖర్చుల కింద 8.27 శాతం వెచ్చించామని పేర్కన్నాయి.