న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు బాధిస్తే తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి క్షమాపణ చెబుతానని అన్నారు. ఈ ఉదంతంపై తనను ఉరితీసినా తాను సిద్ధమేనని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నారని అదిర్ రంజన్ ప్రశ్నించారు.
తాను పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేశానని, రాష్ట్రపతిని అవమానించాలనే ఆలోచన కూడా తనకు లేదని స్పష్టం చేశారు. కాగా అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అధిర్ రంజన్ రాష్ట్రపత్నిగా సంభోదించారు. అధిర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో నిరసనలకు దిగారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ సహా బీజేపీ నేతలు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురలు సోనియా గాంధీని డిమాండ్ చేశారు.