ప్రతాప్గఢ్ (యూపీ), డిసెంబర్ 4: మహాభారతంలో పాండవులు ద్రౌపదిని పాచికలాటలో పణంగా పెట్టి ఓడిన కథ తెలిసిందే. లూడో ఆటకు బానిసైన ఓ మహిళ తనను తానే పందెం కాసి ఓడిపోయింది. గెలిచిన వ్యక్తి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా చోటుచేసుకున్నది. అసలు ఏం జరిగిందంటే.. నగర్కత్వాలిలోని దేవ్కలి ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండే రేణుకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణు భర్త ఉపాధి నిమిత్తం ఆరు నెలల క్రితం రాజస్థాన్లోని జైపూర్కు వెళ్లాడు. నెలనెలా కుటుంబ నిమిత్తం డబ్బులు పంపించేవాడు.
ఈ క్రమంలో రేణు ఆన్లైన్లో లూడో ఆట ఆడేది. డబ్బులు బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకునేది. ఇంటి యజమానితో సైతం నిత్యం లూడో ఆట ఆడేది. ఒక రోజు డబ్బులు మొత్తం పోగొట్టుకున్నది. అంతటితో ఆగకుండా తననే పణంగా పెట్టి గేమ్ ఆడి ఓడిపోయింది. ఆటలో ఓడిపోవడంతో ఆమెను యాజమాని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని రేణు తన భర్తకు వివరించడంతో ఆయన ప్రతాప్గఢ్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేణు భర్త ఈ తతంగం మొత్తం సోషల్మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది. కొసమెరుపు ఏమిటంటే.. పందెంలో ఓడి ఇంటి యాజమాని వద్దకు వెళ్లిన రేణు.. అతడితోనే కలిసి ఉంటూ భర్తతో వచ్చేందుకు ససేమిరా అనడం.