న్యూఢిల్లీ: అమెరికా న్యాయశాఖ(డీవోజే) నమోదు చేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు అదానీ లీగల్ టీమ్ ఒక మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సహాయం తీసుకుంది. ఈ విషయం సదరు సీజేఐ అభిప్రాయంతో కూడిన 500 పేజీల నివేదిక న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సమర్పించిన దరిమిలా వెల్లడైంది. ఈ నివేదికలో పలువురు న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా పొందుపరిచినట్లు సమాచారం.
న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి నికోలస్ గరౌఫిస్ ముందు గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ లీగల్ టీమ్ ఈ నెల 23న 15 పేజీల ఫైలింగ్ను దాఖలు చేసింది. ఈ నివేదికల్లో హార్వర్డ్ లా స్కూల్కు చెందిన ఒక సెక్యూరిటీస్ లా ప్రొఫెసర్, ఒక మాజీ సీజేఐ ఇచ్చిన రిపోర్టులు ఉన్నాయి.