న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయి ఏకాంతంగా చర్చలు జరిపారు. గొడ్డా పవర్ ప్రాజెక్టు కింద బంగ్లాదేశ్కు ట్రాన్స్మిషన్ లైన్ను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తిచేస్తామని అదానీ చెప్పారు. గతంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చినప్పుడు కూడా అదానీ సమావేశమయ్యారు. ప్రధాని లేదా ఇతర ప్రభుత్వ ప్రతినిధులు లేకుండా ఇతర దేశాధినేతలతో అదానీ నేరుగా భేటీ కావడం గమనార్హం. కాగా, 4 రోజుల పర్యటనకు వచ్చిన షేక్ హసీనా మంగళవారం ప్రధాని మోదీతో భేటీ ఆయ్యారు. సరిహద్దులోని ఖుషియారా నదీ జలాల పంపకంపై ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. తీస్తా నది నీటి పంపకాల ఒప్పందంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు.