Gangavaram Port | న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశంలోని విలువైన మౌలిక వసతుల సంపదలైన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గనులు గంపగుత్తగా ప్రధాని మోదీ స్నేహితుడు అదానీ సొంతమవటంపై రోజుకో కథ బయటకొస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ తూర్పు తీరంలోనే అత్యంత కీలకమైన గంగవరం పోర్టును అదానీ గ్రూప్ అడ్డికి పావుశేరుకాడికి సొంతం చేసుకోవటంపై రాజకీయ, వ్యాపార వర్గాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనిపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఏపీలో కోస్తాతీరం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పోర్టులను అభివృద్ధి చేస్తున్నది. అందులో భాగంగా విశాఖ జిల్లాలోని గంగవరం పోర్టును కూడా అభివృద్ధికి ఇచ్చింది. ఈ పోర్టు ప్రమోటర్గా డీవీఎస్ రాజు, ఆయన కుటుంబం ఉన్నది. పోర్టులో ఆయనకు 58.1% వాటా ఉండేది. అంతర్జాతీయ కంపెనీ అయిన వార్బర్గ్ పిన్కస్కు 31.5% వాటా ఉండేది. ఏపీ ప్రభుత్వానికి 10.4% వాటా ఉండేది. వీరందరి నుంచి పోర్టును రూ.6,200 కోట్లకు కొనుగోలు చేసినట్టు అదానీకి చెందిన ఏపీసెజ్ 2021 సెప్టెంబర్లో ప్రకటించింది. డీవీఎస్ రాజుకు సంబంధించిన 58.1% వాటాను రూ.3,604 కోట్లకు, వార్బర్గ్కు చెందిన 31.5% వాటాను రూ.1,954 కోట్లకు, ఏపీ ప్రభుత్వానికి చెందిన 10.4% వాటాను రూ.645 కోట్లకు కొనుగోలు చేసినట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది.
గంగవరం పోర్టుపై అదానీ గ్రూప్నకు ఎప్పటి నుంచో కన్ను ఉన్నది. 2015 నుంచే ఈ పోర్టును సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. వార్బర్గ్ సంస్థ పోర్టులోని తన వాటాలో కొంత మొత్తాన్ని అమ్మాలని 2015 నుంచి ప్రయత్నిస్తున్నది. అప్పుడే.. అంటే 2015లోనే ఆ కంపెనీ తన వాటాను రూ.13,000 కోట్లుగా లెక్కగట్టి అమ్మకానికి పెట్టింది. అప్పటికి ఆ పోర్టు వార్షిక సామర్థ్యం 30 మిలియన్ టన్నులు మాత్రమే. 2019 నాటికి అది రెట్టింపై 60 మిలియన్ టన్నులకు పెరిగింది. వార్గ్బర్గ్ అమ్మకానికి పెట్టిన సమయంలో ఈ పోర్టును మొత్తాన్ని దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్న అదానీ గ్రూప్.. గంగవరం పోర్టు విలువను అంచనా వేసే బాధ్యతను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మకారీస్ క్యాపిటల్కు అప్పగించిందని క్యాపిటల్ క్వెస్ట్ తెలిపింది. ఇక్కడ సీన్ కట్చేస్తే.. 2019 నాటికే రెట్టింపు ఎగుమతి, దిగుమతి సామర్థ్యం సాధించిన పోర్టు మొత్తాన్ని 2021లో అదానీ గ్రూప్ కేవలం రూ.6,200 కోట్లకు కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. పోర్టులో వార్బర్గ్కు చెందిన 31.5% వాటాకు 2015లోనే రూ.13,000 కోట్లు అని లెక్కగట్టారు. ఈ లెక్కన అప్పుడే మొత్తం పోర్టు విలువ రూ.70-80 వేల కోట్లు ఉంటుంది. అంతేకాకుండా, పోర్టు వార్షికాదాయం 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.650 కోట్లకుపైగానే ఉన్నది. సంస్థ వద్ద రూ.570 కోట్ల నిధులు కూడా ఉన్నాయి. ఐదేండ్ల తర్వాత రెట్టింపు సామర్థ్యం సాధించిన పోర్టు విలువ కూడా దాదాపు రెట్టింపు పెరగాలి. కానీ విచిత్రంగా వాటాదారులంతా కలిసి అదానీకి పోర్టును రూ.6,200 కోట్లకే అమ్మేశారు.
ఏపీకే చెందిన కృష్ణపట్నం పోర్టును కూడా అదానీ గ్రూపే కొనుగోలు చేసింది. అదే ఏడాది గంగవరం పోర్టును కూడా కొన్నది. ఈ రెండు పోర్టుల సామర్థ్యం సమానంగా 60 మిలియన్ టన్నులే. కానీ, కృష్ణపట్నం పోర్టును అదానీ గ్రూప్ రూ.13,572 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ పోర్టుకు అప్పటికి ఉన్న విలువకు 10.2% అధిక ధరకు కొనుగోలు చేసింది. ఈ పోర్టుకు రూ.6,212 కోట్ల అప్పు కూడా ఉన్నది. గంగవరం పోర్టుకు పైసా అప్పు లేదు. అయినా, వాటాదారులంతా కలిసి పోర్టును కృష్ణపట్నం పోర్టుతో పోల్చితే సగం ధరకే అమ్మేశారని, ఇందులో అక్రమాలు జరిగాయని ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది