స్కైపవర్ గ్లోబల్తో ఒప్పందం
న్యూఢిల్లీ, మార్చి 20: అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్).. తెలంగాణలోని 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. ఈ మేరకు కెనడాకు చెందిన స్కైపవర్ గ్లోబల్తో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు శనివారం ఏజీఈఎల్ తెలిపింది. తెలంగాణలో 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఓ స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ద్వారా టోరంటో కేంద్రంగా నడుస్తున్న స్కైపవర్ గ్లోబల్ నిర్వహిస్తున్నది. 2017 అక్టోబర్లో దీన్ని ఏర్పాటు చేయగా, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో దీర్ఘకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కూడా చేసుకున్నది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంటున్నది. కాగా, ఈ ప్రాజెక్టుతో తమ రెన్యువబుల్ ఎనర్జీ విభాగం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో ఏజీఈఎల్ ఆనందం వ్యక్తం చేసింది. 2025 నాటికి 25 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకెళ్తున్నది. ప్రస్తుతం సంస్థ 14.86 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నది.