న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఫేస్బుక్, గూగుల్ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనలు చూస్తూనే ఉంటాం. ఈ ప్రకటనల ద్వారా ఈ రెండు టెక్ దిగ్గజాలకు వస్తున్న ఆదాయం.. భారత్లోని టాప్ 10 సంప్రదాయ మీడియా సంస్థల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ వార్తాసంస్థ విశ్లేషణలో వెల్లడైంది. భారత్ పరిధిలోని ఆన్లైన్ మాధ్యమాల్లో ఇచ్చే మొత్తం డిజిటల్ అడ్వైర్టెజ్మెంట్లలో 80 శాతం ఆదాయం ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకే వస్తున్నది. జీ-ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజెస్, సన్టీవీ నెట్వర్క్ వంటి టాప్-10 మీడియాలు ప్రకటనల ద్వారా 2020-21లో రూ.8,396 కోట్లు ఆర్జించగా.. ఫేస్బుక్, గూగుల్కు సంయుక్తంగా వచ్చిన ఆదాయం ఏకంగా రూ. 23,213 కోట్లుగా ఉన్నది.
నెట్ప్రాఫిట్లో వెనుకంజ
ప్రకటనల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఫేస్బుక్, గూగుల్ సంస్థలు.. నెట్ ప్రాఫిట్ విషయంలో మాత్రం సంప్రదాయ మీడియాల కంటే వెనుకంజలోనే ఉన్నాయి. దీనికి కారణం భారత్లో ఆయా కంపెనీలు ‘అడ్వైర్టెజ్మెంట్ రీసెల్లర్ మోడల్’ను అనుసరించి పనిచేయడమే. వివరంగా చెప్పాలంటే.. ఫేస్బుక్, గూగుల్ ప్రధాన కార్యాలయాలు అమెరికాలో ఉన్నాయి. ఇండియాలో పనిచేస్తున్నవి బ్రాంచీలు మాత్రమే. దీంతో అడ్వైర్టెజ్మెంట్ను డిస్ప్లే చేయడానికి సైట్లో కొంత స్థలాన్ని బ్రాంచీలైన ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియా కంపెనీలు.. మాతృ సంస్థలైన ఫేస్బుక్, గూగుల్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన స్థలానికి చెల్లింపులను యాడ్ ద్వారా వచ్చిన ఆదాయం నుంచి చేస్తాయి. అలా ఈ బ్రాంచీ సంస్థలు ప్రకటనల ఆదాయంలో ముందున్నప్పటికీ, నెట్ ప్రాఫిట్లో వెనుకంజలోనే ఉన్నాయి. ప్రకటనల కోసం స్థలాన్ని వాడుకున్నందుకు.. మాతృసంస్థకు ఫేస్బుక్ ఇండియా 90 శాతం ప్రకటనల ఆదాయాన్ని చెల్లిస్తుండగా, గూగుల్ ఇండియా 87 శాతం చెల్లిస్తున్నది. అయితే, ఎలా చూసుకున్నా.. ఈ మొత్తం ఆదాయం ఫేస్బుక్, గూగుల్కే చెందుతుంది.