Actor Vijay : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు కస్టోడియల్ డెత్ (Custodial Death) సంచలనం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం చెన్నైలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ‘తమిళగ వెట్రి కళగం (Tamiliga Vetri Kazhagam)’ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Vijay) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదని, న్యాయమని అన్నారు.
నిరసన కార్యక్రమంలో నటుడు విజయ్ నల్ల చొక్కా ధరించారు. చేతిలో ‘సారీ కాదు, మాకు న్యాయం కావాలి’ అని రాసిపెట్టి ఉన్న ప్లకార్డును పట్టుకున్నారు. అనంతరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీవీకే శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఎక్కువగా సారీ అనే సమాధానమే వినిపిస్తోందని విమర్శించారు. అన్నా యునివర్సిటీ కేసు నుంచి అజిత్ కుమార్ కేసు వరకు డీఎంకే పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలని ప్రశ్నించారు.
కోర్టులే జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని, అలాంటప్పుడు ప్రభుత్వంతో పనేముంది, ముఖ్యమంత్రితో అవసరం ఏముందని విజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుడు అజిత్ కుమార్ పేద కుటుంబం నుంచి వచ్చిన యువకుడని, ఈ ఘటన అనంతరం సీఎం సారీ చెప్పారని అన్నారు. డీఎంకే పాలనలో ఇప్పటివరకు 24 మంది కస్టడీలో మరణించారని, వారందరికి కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అజిత్ కుమార్ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలన్నారు. కాగా
శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని మడపురంలో భద్రకాళియమ్మన్ ఆలయానికి ఇటీవల వచ్చిన ఇద్దరు మహిళా భక్తుల నగలు పోయాయి. ఈ కేసులో ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న అజిత్కుమార్తో సహా పలువురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అజిత్ను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది.
దాంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారిస్తోంది. అజిత్ ఒంటిపై 44 గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోలీస్ కస్టడీలో అతడు తీవ్రమైన హింసకు గురైనట్లు వైద్యులు తెలిపారు. గుండె, కాలేయం లాంటి అంతర్గత భాగాల్లో తీవ్ర రక్తస్రావం అయినట్లు వెల్లడించారు.