చెన్నై: తమిళ సినిమా నటుడు, అసిస్టెంట్ డైరెక్టర్ శరన్రాజ్ (29) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. తమిళ సినీ పరిశ్రమకే చెందిన మరో నటుడు పళనియప్పన్ తప్పతాగి కారు నడుపుతూ.. బైక్పై వెళ్తున్న శరన్ రాజ్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరన్ రాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
చెన్నై మహా నగరంలోని కేకే నగర్ ఏరియాలోగల ఆర్కోట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి 11.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తాగి కారు నడిపిన నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
శరన్ రాజ్ ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శరన్ రాజ్ను తమిళ సినిమాల్లో సహ నటుడిగా నటిస్తున్న పళనియప్పన్ కారుతో ఢీకొట్టాడు. శరన్ రాజ్ ఆకస్మిక మరణవార్త ఆయన కుటుంబసభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.