జైపూర్: రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్పై పోరుబాట పట్టారు. వసుంధర రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వం అవినీతిపై 15 రోజుల్లో చర్యలు చేపట్టాలని అల్టిమేటమ్ ఇచ్చారు. లేని పక్షంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను తీవ్రం చేస్తానని హెచ్చరించారు. అశోక్ గెహ్లాట్పై ఒత్తిడి తెచ్చేందుకు జన సంఘర్షణ్ పేరుతో ఐదు రోజుల పాదయాత్ర చేపట్టారు. అజ్మీర్ నుంచి జైపూర్ వరకు కొనసాగిన జన సంఘర్షణ యాత్ర సోమవారంతో ముగిసింది.
కాగా, యాత్ర ముగింపు సందర్భంగా సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడారు. పేపర్ లీక్స్ నేపథ్యంలో రాజప్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను బ్యాన్ చేసి కొత్తది ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పేపర్ లీక్ వల్ల ప్రభావితమైన ప్రభుత్వ ఉద్యోగాల ఆశావహులకు పరిహారం ఇవ్వాలన్నారు. తాను లేవనెత్తిన సమస్యలు అత్యవసరం కాబట్టే ప్రజల మద్దతు లభిస్తున్నదని తెలిపారు.
మరోవైపు తాను ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదని, అలాగే ఎవరిపట్ల కూడా తనకు శతృత్వం లేదని సచిన్ పైలట్ తెలిపారు. అవినీతిపై సీఎం అశోక్ గెహ్లాట్కు తాను ఎన్ని లేఖలు రాసినా ఆయన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 40 శాతం కమీషన్ వంటి అవినీతి ఆరోపణల వల్లనే కర్ణాటక ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించారని అన్నారు. అందుకే అవినీతిపై చర్యల కోసం తాను పోరాడుతున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఏడాదిలోనే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.