Acharya Pramod Krishnam : పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్ కృష్ణం వేటుకు గురయ్యారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అనంతరం ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్పై ఆదివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. తనను ఆరేండ్లకు బదులు 14 ఏండ్ల పాటు బహిష్కరించాల్సిందని, ఎందుకంటే రాముడు సైతం 14 ఏండ్లు వనవాసంలో ఉన్నారని ఆచార్య ప్రమోద్ కృష్ణం గుర్తుచేశారు.
తనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ నుంచి బహిష్కరించినట్టు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారని అన్నారు. పార్టీ నుంచి తనకు విముక్తి కల్పించినందుకు ముందుగా కాంగ్రెస్ నాయకత్వానికి తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానని ముందుగా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నానని అన్నారు. రాముడి పేరు ప్రస్తావించడం, అయోధ్య వెళ్లడం లేదా ప్రాణ ప్రతిష్ట వేడుక ఆహ్వానాన్ని మన్నించడం లేకుంటే నరేంద్ర మోదీని కలవడం ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలా అని ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పలు నిర్ణయాలతో తాను విభేదిస్తానని అన్నారు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకించడం సరికాదన్నారు. డీఎంకే నేతలు సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చినప్పుడు కాంగ్రెస్ వారికి మద్దతుగా నిలిచిఉండాల్సింది కాదని స్పష్టం చేశారు. రాముడు, రాజ్యం గురించి తాను ఎలాంటి రాజీపడనని, ఇప్పుడు తాను స్వేచ్ఛా జీవినని ఆచార్య ప్రమోద్ కృష్ణం పేర్కొన్నారు.
Read More :