గోద్రా, ఆగస్టు 15: బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన 11 మంది జీవిత ఖైదులు సోమవారం గోద్రా సబ్జైలు నుంచి విడుదలయ్యారు. వీరి విడుదలకు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రెమిషన్ పాలసీ కింద ఆమోదించిన నేపథ్యంలో మొత్తం 11 మంది దోషులూ జైలు నుంచి బయటకు వచ్చారు. 2002లో గోద్రా ఘటన తర్వాత చోటుచేసుకున్న బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్య కేసులో 2002లో సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందికి శిక్ష విధించింది.
బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దోషులు ఇప్పటికే 15 ఏండ్లకు పైగా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు విడుదల కోరుతూ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 11 మంది దోషులకు శిక్ష నుంచి ఉపశమనం కలిగించాలని సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఈ మేరకు దోషులను విడుదల చేయాలని ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు అందాయని పంచమహల్ జిల్లా కలెక్టర్ సుజల్ మయత్ర తెలిపారు.