Crime News : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అన్నా యూనివర్సిటీ (Anna University) లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న జ్ఞానశేఖరన్ (Jnanashekharan) ను తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని మహిళా కోర్టు దోషిగా తేల్చింది. అతడిపై చార్జిషీట్లో పేర్కొన్న మొత్తం 11 అభియోగాల్లో అతడు దోషిగా తేలాడు. ఇక కోర్టు అతడికి శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.
ఈ కేసు విచారణ సందర్భంగా మహిళా కోర్టు జడ్జి రాజలక్ష్మి మాట్లాడుతూ.. అన్ని అభియోగాల్లో దోషిగా తేలినందున జ్ఞానశేఖరన్కు కచ్చితంగా తీవ్రమైన శిక్షపడాలని అన్నారు. అయితే జ్ఞానశేఖరన్ మాత్రం తనకు తక్కువ శిక్ష విధించాలని కోర్టును కోరాడు. తాను వృద్ధురాలైన తన తల్లితోపాటు, ఎనిమిదేళ్ల కుమార్తె బాగోగులు చూసుకోవాల్సి ఉందని, కాబట్టి తనకు తక్కువ శిక్ష విధించాలని అభ్యర్థించాడు.
అన్నా యూనివర్సిటీ పరిసరాల్లో బిర్యానీ పాయింట్ నడుపుతున్న జ్ఞానశేఖరన్ గత ఏడాది డిసెంబర్లో 19 ఏళ్ల విద్యార్థినిపై క్యాంపస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి తన స్నేహితుడితో ఏకాంతంగా మాట్లాడుతుండగా అక్కడికి వెళ్లిన జ్ఞానశేఖరన్ ముందుగా స్నేహితుడిపై దాడి చేశాడు. ఆ తర్వాత యువతిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతటితో ఆగకుండా ఆ ఘటనను తన మొబైల్లో రికార్డు చేశాడు. విషయం బయట చెప్పినా, తాను పిలిచినప్పుడు రాకపోయినా వీడియో బయటపెడుతానని బెదిరించాడు. అయినా ఆ యువతి ఆ ఘటన అనంతరం తన స్నేహితుడితో కలిసి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం మహిళల రక్షణలో విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే పోలీసులు ఘటనపై విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేశారు. జ్ఞానశేఖరన్పై మొత్తం 11 అభియోగాలు మోపారు. ఇవాళ మహిళా కోర్టు ఆ అన్ని అభియోగాల్లోనూ అతడిని దోషిగా ప్రకటించింది. ఇక శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.