న్యూఢిల్లీ, జూన్ 1: పశ్చిమ కనుమల్లో తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకొని బతుకుతున్న 62 రకాల జాతుల మొక్కలను గుర్తించినట్టు కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ తెలిపింది. డిసికేషన్ టాలరెంట్ వ్యాస్కూలర్ (డీటీ)గా పిలిచే ఇవి తమలోని 95 శాతం నీటిని కోల్పోయినా జీవించే ఉంటాయి. పుణెలోని అఘార్కర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ మందార్ దాతార్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు నిర్వహించారు. అధ్యయన ఫలితాలను నోర్డిక్ జర్నల్ ఆఫ్ బాటనీలో ప్రచురించారు.
తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ మొక్కలు నిద్రాణస్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం నీటి లభ్యత ఉన్నప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చేస్తాయి. ఈ మొక్కలపై చేసే పరిశోధనలు ఎడారి, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పంటల సాగుకు ఉపయోగపడతాయని కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిపై మరిన్ని పరిశోధనలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 62 జాతుల్లో 16 జాతులు భారత్లోని స్థానిక జాతులకు చెందినవని పరిశోధకులు తేల్చారు. 12 జాతులు పశ్చిమ కనుమల్లో మాత్రమే జీవించే జాతులని గుర్తించారు.