Manipur Violence | న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై రాజ్యసభ, లోక్సభలు గురువారం దద్దరిల్లాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే మణిపూర్ హింసాకాండ ఉభయ సభలను కుదిపేసింది. మణిపూర్ హింసాకాండ, మహిళలపై జరుగుతున్న దారుణాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మణిపూర్ మంటల్లో కాలుతున్నా… ప్రధాని మోదీ మౌనం వీడటం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.‘మణిపూర్.. మణిపూర్ మంటల్లో కాలిపోతున్నది’ అంటూ ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో ఉభయ సభలు మార్మోగాయి. ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లోనూ దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు కేంద్రం ఈ అంశంపై చర్చించకుండా దాటవేసేందుకు ప్రయత్నించింది.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫి చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కేంద్రం తీరుపై మండిపడ్డారు. 267 రూల్ ప్రకారం మణిపూర్ అంశంపై చర్చించేందుకు నోటీస్ ఇచ్చానని, ఇతర అంశాలను పక్కనపెట్టి అత్యవసర చర్చకు అనుమతులివ్వాలని ఆయన చైర్మన్ను కోరారు. ‘మణిపూర్ తగలబడిపోతున్నది. మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. మణిపూర్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా చర్చించాలి’ అని పేర్కొన్నారు. విపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వెనక్కి తగ్గకపోవడంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రియన్తో పాటు మరో 8 మంది అందించిన నోటీసులను రాజ్యసభ చైర్మన్ స్వీకరించారు. తొలుత ఉభయసభల్లోనూ దివంగత సభ్యులకు నివాళులు అర్పించారు.
లోక్సభలోనూ గందరగోళం…
మణిపూర్ అంశం లోక్సభను కుదిపేసింది. ‘మణిపూర్.. మణిపూర్’ అంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వారికి హామీ ఇచ్చారు. ఈ అంశంపై హోం మంత్రి అమిత్ షా పూర్తి సమాధానం ఇస్తారని వారు తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.
ఖర్గే చాంబర్లో విపక్షాల సమావేశం…
ఇండియా కూటమికి చెందిన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మణిపూర్ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించారు. మరోవైపు మణిపూర్ సీఎం బీరేన్సింగ్ రాజీనామా చేయాలని మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ‘మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఇప్పుడే పార్లమెంట్లోకి ప్రవేశించారు. ఉదయం ప్రధాని మోదీ మహిళల భద్రతపై ఉపన్యాసాలు ఇచ్చారు.బీజేపీ డీఎన్ఏలోనే డబుల్ స్టాండర్డ్ ఉన్నది’ అని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ విమర్శించారు.
ఇది హృదయ విదారకరమైన అనాగరిక చర్య. అందరం ఐక్యంగా దీన్ని ఖండించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి.
– మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం
మన ఉమ్మడి నైతికత ఏమైపోయింది? ద్వేషం మనలోని మానవత్వాన్ని పెకలించివేస్తున్నది.
– స్టాలిన్, తమిళనాడు సీఎం
ప్రధాని మోదీ మౌనం బలహీన నాయకుడి లక్షణాన్ని సూచిస్తున్నది. వైరల్ అవుతున్న వీడియోలో నిందితుల ముఖాలు కనిపిస్తున్నా వారిని అరెస్ట్ చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నది.
– అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
ఆర్ఎస్ఎస్ విద్వేష విధానం, బీజేపీ ఓటు రాజకీయాలు మణిపూర్ దుస్థితికి కారణం. అక్కాచెల్లెళ్లు కలిగిన కుటుంబాలు ఇకపై బీజేపీ వైపు చూడటానికి కూడా ఆలోచిస్తాయి.
– అఖిలేశ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధినేత