లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సొంతూరైన గోరఖ్పూర్లో అధికార బీజేపీకి (BJP) చెందిన ఏబీవీపీ (ABVP) సభ్యులు రెచ్చిపోయారు. గోరఖ్పూర్లోని (Gorakhpur) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విశ్వవిద్యాలయం (Deen Dayal Upadhyay University) వీసీ సహా ఉన్నతాధికారులపై దాడిచేశారు. అడ్డుకున్న పోలీసులపై కూడా విరుచుకుపడ్డారు. వర్సిటీలోని వివిధ సమస్యలపై ఏబీవీపీ నాయకులు విశ్వవిద్యాలయం గేటు ముందు శుక్రవారం ఉదయం ధర్నాకు దిగారు. మధ్యాహ్నం అయినప్పటికీ వర్సిటీ అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో వీసీ (VC) కార్యాలయంపై దాడిచేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేయడంతోపాటు తలుపులను బద్దలుకొట్టారు. పరిసరాలను మొత్తం చిన్నాభిన్నం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డుకోవాలని చూసిన స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్తోపాటు (Deputy Dean of Students Welfare) పలువురు ప్రొఫెసర్లను విచక్షణా రహితంగా కొట్టారు. వీసీ, రిజిస్ట్రార్లపై చేయిచేసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీకి చేరుకున్నారు. విద్యార్థి సంఘం నాయకులను అడ్డుకున్న పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అధనపు బలగాలను వర్సిటీకి రప్పించారు. వర్సిటీ స్టాఫ్పై దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి సొంతూర్లోనే ఏబీవీపీ నాయకులు విధ్వంసానికి పాల్పడటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీ అండ చూసుకుని విర్రవీగుతున్నారని విమర్షిస్తున్నారు. సరస్వతీ నిలయాలైన వర్సిటీల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.