Abdul Karim Tunda | జైపూర్ : 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ రాజస్థాన్లోని ప్రత్యేక టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (టాడా) కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు ఏడాది అయిన సందర్భంగా పలు రైళ్లలో పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోటా, కాన్పూర్, సికింద్రాబాద్, సూరత్ మీదుగా వెళ్లే రైళ్లలో పేలుళ్లు జరిగాయి.
ఈ కేసులో తుండాతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. ఇదిలా ఉంటే.. 1996 బాంబు పేలుళ్ల కేసులో ప్రస్తుతం తుండా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. పలు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడిగా పేరుగాంచిన తుండా బాంబు తయారీలో నైపుణ్యానికి డాక్టర్ బాంబ్గా గుర్తింపు పొందాడు. తుండాను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సమాచారం.