న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజిందర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి దుర్గేష్ పాఠక్ విజయం సాధించారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై 11,000కుపైగా ఓట్ల మెజార్టీ సాధించారు. రాజిందర్ నగర్ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా రాజీనామా చేసి పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఈ స్థానానికి గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. 43.75 శాతం ఓటింగ్ నమోదు కాగా, సుమారు 72 వేల మంది ఓట్లరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ తొలి రౌండ్ నుంచి లీడ్లో ఉన్నారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై 11,000కుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ లతకు కేవలం 2000 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కాగా, ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ విజయంపై ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజిందర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చెడ్డ రాజకీయాలను ఓడించి మంచి పనులు చేసిన ఆప్కు ప్రజలు మద్దతిచ్చారని అన్నారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా రాజిందర్ నగర్ నియోజక వర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను 62 స్థానాలను ఆప్ సొంతం చేసుకుంది.