Aam Admi Party | తొలుత ఢిల్లీలో.. ఇటీవల పంజాబ్లో పాగా వేసిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అటుపై మరింత విస్తరణ దిశగా దూకుడుగా వెళుతున్నది. బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అనే రీతిలో సాగుతున్నది. తాజాగా మధ్యప్రదేశ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ బోణీ చేసింది. సింగ్రౌలీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ 9000 ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఫలితంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2014లో తొలుత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా రాణి అగర్వాల్ ఎన్నికయ్యారు. తాజాగా సింగ్రౌలీ నగర మేయర్ పీఠాన్ని అధిష్టించనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే, సింగ్రౌలీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో రాణి అగర్వాల్కు మద్దతుగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. సింగ్రౌలీ మేయర్గా ఎన్నికైన రాణి అగర్వాల్తోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ విజేతలకు కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.