ఇకపై పంజాబ్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని, పంజాబ్ అంతటా అభివృద్ధే తాండవిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా పంజాబ్ ప్రజలు ఓ కమాల్ చేశారని పునరుద్ఘాటించారు. పంజాబ్ ఎన్నికల్లో బంపర్ విక్టరీని సాధించిన నేపథ్యంలో ఆప్ పెద్ద ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి సీఎం కేజ్రీవాల్, ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్తో సహా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ… ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొన్నింటికి కొంత సమయం పడుతుందని, వాటిని అమలు చేయడం మాత్రం పక్కా అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ను సీఎం కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆయన అత్యంత నిజాయితీ పరుడని కితాబునిచ్చారు. పంజాబ్ను దోచుకోవడం అనే ప్రక్రియకు తమ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకట్ట వేస్తుందని హామీ ఇచ్చారు. పంజాబ్లో ఆప్ విజయం సాధించడం పెద్ద విప్లవమని, రాష్ట్ర చరిత్రలోనే ప్రజలు ఓ నిజాయితీపరుడైన అభ్యర్థిని తమ సీఎంగా ఎన్నుకున్నారని కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఆప్ నేతలు, మంత్రులు ఎవ్వరైనా అవినీతికి పాల్పడితే జైలే గతి అని కేజ్రీవాల్ ప్రకటించారు.