AAP | న్యూఢిల్లీ, మే 22: ఢిల్లీలో అధికారుల పోస్టింగ్లు, బదిలీల విషయంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్ట్నెంట్ గవర్నర్ (ఎల్జీ)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై ఆప్ సర్కార్ పోరుబాటకు సిద్ధమైంది. ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తాజాగా ఈ విషయంలో ప్రజల వద్దకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘నల్ల ఆర్డినెన్స్’కు వ్యతిరేకంగా జూన్ 11న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మహా ర్యాలీ చేపడుతామని ఆప్ సోమవారం ప్రకటించింది. ఇంటింటి ప్రచారం కూడా చేపడుతామని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంపై తన నిరంకుశ నిర్ణయాలను రుద్దుతున్నదనే దానికి ఈ ఆర్డినెన్స్ నిదర్శనమని విమర్శించారు. ఢిల్లీలోని ప్రజలు వచ్చే నెల నిర్వహించనున్న ర్యాలీకి తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఇది ప్రతిపక్షాలకు అగ్ని పరీక్ష
రాజ్యసభలో విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఆర్డినెన్స్ సంబంధిత బిల్లును ఓడించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలకు ఇది అగ్ని పరీక్ష వంటిదని, ఎగువసభలో బిల్లు పాస్ కాకుండా ఉండేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలు మద్దతు పలకాలని కోరారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కలిసి రావాలన్నారు. కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా ప్రజాస్వామాన్ని హరించిందని, సమాఖ్య వ్యవస్థపై దాడి చేసిందని విమర్శించారు. కేంద్రం సుప్రీంకోర్టు తీర్పునే కాలరాసిందని అన్నారు. దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. ఎక్కడ బీజేపీ ఓడిపోయిందో.. కేంద్రం అక్కడ ఎల్జీ లేదా గవర్నర్ల ద్వారా ఎన్నికైన విపక్ష పాలిత ప్రభుత్వాలను వేధింపులకు గురిచేస్తున్నదని ఢిల్లీ ఆప్ మంత్రి అతిశి తూర్పారబట్టారు.
కేజ్రీవాల్ వరుస పర్యటనలు
మరోవైపు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా కేజ్రీవాల్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా విపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేజ్రీవాల్తో సమావేశమై తమ మద్దతు ప్రకటించారు. కేజ్రీవాల్ మంగళవారం కోల్కతా వెళ్లి ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత 24, 25 తేదీల్లో ముంబైలో ఎన్సీపీ చీఫ్ శరద్పవార్, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆప్కు కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్తో నితీశ్కుమార్ సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ పార్లమెంట్లో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఓటేస్తామని పేర్కొన్నారు.
రాజ్యసభలో తటస్థ పార్టీల వైఖరే కీలకం
ఆర్డినెన్స్ సంబంధిత బిల్లును ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అది చట్టంగా మారుతుంది. లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఉన్నా.. రాజ్యసభలో లేదు. 245 మందికి(మెజార్టీ 123)గానూ 110 మంది ఎంపీలే ఉన్నారు. రాజ్యసభలో 18 మంది ఎంపీల బలమున్న వైసీపీ, బీజేడీ బయటి నుంచి ఇచ్చే మద్దతుతో బీజేపీ బిల్లులను ఆమోదింపజేసుకొంటున్నది. రాజ్యసభలో ఆప్కు 10 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, ఎస్పీ, శివసేన(యూబీటీ) వామపక్షాలు, తదితర పార్టీల మద్దతుతో పాటు బీఆర్ఎస్ మద్దతు కూడా ఆప్ ఆశిస్తున్నది. బిల్లును ఓడించడంలో వైసీపీ, బీజేడీ వంటి తటస్థ పార్టీల వైఖరే కీలం కానున్నది.