Massive Traffic | మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలతో రాజధాని ఢిల్లీ ( Delhi)లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది (Massive Traffic). మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనల నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యాలయం, ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు (Police Shut Several Roads). దీంతో ఐటీఓ చౌక్, రాజ్ఘాట్, వికాస్ మార్గ్ల దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చి కేజ్రీ అరెస్ట్కు నిరసనగా, బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఐటీవో కూడలి, డీడీయూ మార్గ్లోని ఆప్, బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో ఇవాళ రాజధాని నగరం రణరంగంగా మారింది.
సెంట్రల్ ఢిల్లీలోని పలు రహదారులను మూసివేసి వాహనాల రాకపోకలను నిషేధించారు. డీడీయూ మార్గ్కు వెళ్లే రహదారిపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎక్స్ వేదికగా ప్రజలకు పలు సూచనలు చేశారు. ఢిల్లీలో ఆప్ నిరసనల దృష్ట్యా డీడీయూ మార్గ్ మూసివేసినట్లు తెలిపారు. దీంతో ఐపీ మార్గ్, వికాస్ మార్గ్, మింటో రోడ్, బహదూర్ షా జాఫర్ మార్గ్లో భారీగా ట్రాఫిక్ ఉంటుందని ప్రజలు ఆయా మార్గాల్లో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు. అదేవిధంగా ఈడీ కార్యాలయానికి వెళ్లే రహదారిని కూడా మూసివేయడంతో.. కృష్ణ మీనన్ మార్గ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్, జన్పథ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లను నివారించాలని సూచించారు.
Also Read..
Arvind Kejriwal | సుప్రీంకోర్టులో పిటిషన్ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్
Arvind Kejriwal | కేజ్రీ అరెస్ట్కు వ్యతిరేకంగా నిరసనలు.. పోలీసుల అదుపులో ఆప్ మంత్రులు