AAP | న్యూఢిల్లీ : అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు శంకాచార్య పీఠాధిపతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, శాస్త్ర విధులు, ఆచారాలకు అనుగుణంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం లేదని మండిపడ్డారు. ఆలయ నిర్మాణం పూర్తికాకుండానే విగ్రహ ప్రతిష్ఠా? అని ప్రశ్నించారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు తామెవ్వరం హాజరు కాబోమని పీఠాధిపతులు తేల్చిచెప్పారు.
అయితే పీఠాధిపతులు చేసిన వ్యాఖ్యలను ఆప్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సమర్థించారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల విషయంలో పీఠాధిపతుల వ్యాఖ్యలను గౌరవిస్తున్నామని తెలిపారు. ఒక వేళ యూపీలో తామే అధికారంలో ఉండి ఉంటే, కచ్చితంగా పీఠాధిపతుల కాళ్లకు నమస్కరించి, ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు తీసుకొచ్చే వాళ్లమని చెప్పారు. పీఠాధిపతులు లేకుండా వేడుకలు నిర్వహించడం సబబు కాదన్నారు.
అయోధ్య రామాలయం పూర్తి కాలేదని నలుగురు పీఠాధిపతులు చెప్పారని భరద్వాజ్ గుర్తు చేశారు. ఆలయం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేయడం సరికాదని వారు చెప్పారు. హిందూ మతానికి పీఠాధిపతులే సుప్రీం అని, వారి వ్యాఖ్యలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు భరద్వాజ్. పీఠాధిపతులు ఆ వేడుకకు హాజరు కాకపోవడం బాధాకరమన్నారు. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్, గుజరాత్లోని ద్వారకా, ఒడిశాలోని పూరి, కర్ణాటకలోని శృంగేరి పీఠాధిపతులు రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావొద్దని నిర్ణయించుకున్నారు.