న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్లో అత్యధిక స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలువనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీకి కేవలం ఒకటిరెండు స్థానాల దూరంలో మాత్రమే ఉండనుంది. ఇక గోవా, ఉత్తరాఖండ్లో తన ఉనికిని చాటనుంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీనే అధికారం చేపట్టనుంది. కాంగ్రెస్ పార్టీ గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నామమాత్రపు పోటీ మాత్రమే ఇవ్వనుంది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టైమ్స్ నౌ నవభారత్ చేయించిన ఒపీనియన్ పోల్స్ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
పంజాబ్లో అధికార కాంగ్రెస్కు ఎదురుగాలి..
టైమ్స్ నౌ నవభారత్ తరఫున వీటో అనే సంస్థ ఈ ఒపినియన్ పోల్స్ సర్వే చేసింది. ఈ సర్వే నివేదిక ప్రకారం.. పంజాబ్లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగాను ఆమ్ఆద్మీ పార్టీ 53 నుంచి 57 స్థానాల్లో విజయం సాధించనుంది. ఇక 2017 ఎన్నికల్లో 77 స్థానాలు గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 41 నుంచి 45 స్థానాలకు పరిమితం కానుంది. శిరోమణి అకాలీదళ్-బీఎస్సీ కూటమి కేవలం 14 నుంచి 17 స్థానాల్లో మాత్రమే విజయం దక్కించుకోనుంది. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూటమి సింగిల్ డిజిట్కే పరిమితం కానున్నది.
ఉత్తరాఖండ్లో మళ్లీ బీజేపీకే పగ్గాలు..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మళ్లీ బీజేపీకే అధికార పగ్గాలు దక్కనున్నాయి. 2017 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను 56 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న బీజేపీ.. ఈసారి సీట్ల సంఖ్య కొంత తగ్గినా అధికారాన్ని మాత్రం తిరిగి నిలుపుకోనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 42 నుంచి 48 స్థానాలు దక్కనున్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా 12 నుంచి 16 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలువనుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 4 నుంచి 7 స్థానాల్లో గెలిచి ఉత్తరాఖండ్లో తన ఉనికి చాటుకోనుంది.
గోవాలో ప్రధాన ప్రతిపక్షంగా ఆప్..
గోవాలో ఆమ్ఆద్మీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలువనుంది. మొత్తం 40 స్థానాలకుగాను ఆ పార్టీకి 7 నుంచి 11 స్థానాల్లో విజయం దక్కనుంది. కాగా, 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయినా 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఇండిపెండెంట్లు, కాంగ్రెసేతర పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి మునుపటి కంటే ఎక్కువగా 18 నుంచి 22 స్థానాలు దక్కించుకోనున్న బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్ 4 నుంచి 6 స్థానాలకు పరిమితం కానుంది. మమతాబెనర్జి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నది.