AAP protest | ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆప్ కార్యకర్తలు, మురికివాడల ప్రజలు బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను తొలగించేందుకు పోలీసులతో ఘర్షణకు దిగారు. కాగా, నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు వినియోగించారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు.
ధౌలా కువాన్లో ఉన్న మురికివాడలను కూల్చివేయాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. పండుగ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా.. వాటర్ క్యానన్లతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలువురు మహిళలు గాయపడ్డారు. నివాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా చలికాలంలో రోడ్డుపైకి నెట్టేయడం మానవత్వం లేని పనిగా ఆప్ వర్ణించింది. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం పీడబ్ల్యూడీని ఆదేశించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. ధౌలా కువాన్ ప్రాంతంలోని మురికివాడల నివాసితులు 15 రోజుల్లోగా భూమిని ఖాళీ చేయాలని డిసెంబర్ 29న పీడబ్ల్యూడీ నోటీసు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుపై ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ ఎవరి ఇళ్లను కూల్చివేయడానికి అనుమతించదన్నారు. ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీ ఎందుకిలా వ్యవహరిస్తున్నదో తెలియడం లేదని చెప్పారు. కూల్చివేత ఉత్తర్వులకు వ్యతిరేకంగా పార్లమెంట్ సమీపంలో కూడా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతామని పార్టీ ఎమ్మెల్యే ఆదిల్ అహ్మద్ హెచ్చరించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు బీజేపీ తమ మ్యానిఫెస్టోలో మురికివాడల నివాసితులందరికీ ఇల్లు కట్టిస్తామని హామి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు అయిపోగానే ఇప్పుడు మురికివాడలను కూల్చివేయాలని నోటీసులు పంపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.