Delhi | న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ సర్కార్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో కొత్త వివాదం చెలరేగింది. సీఎం కేజ్రీవాల్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైల్స్ను రాష్ట్ర ముఖ్యకార్యదర్శి నరేశ్కుమార్ నేరుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ వ్యవస్థను సీఎస్ నరేశ్కుమార్ అనుసరించటం లేదని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆసియా పసిఫిక్ నగరాల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ మేయర్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సివుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ఫైల్ను సీఎస్ నరేశ్కుమార్ నేరుగా ఎల్జీకి పంపారని ఆప్ పేర్కొన్నది. సీఎం అనుమతి లేకుండా అనేక ఫైల్స్ ఎల్జీకి వెళ్లాయని ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగ విధులను నెరవేర్చటంలో సీఎస్ పూర్తిగా ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది.