న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొహాలీలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో భగవంత్ మాన్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. సీఎం అభ్యర్ధి పేరును ప్రతిపాదించాలని పార్టీ ఇటీవల వెల్లడించిన మొబైల్ నెంబర్కు భగవంత్ మాన్ పేరును పెద్దసంఖ్యలో ప్రజలు సూచించారు.
ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్ల ద్వారా లక్షలాది మంది మాన్కు మద్దతుగా ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఆయన పేరును ఖరారు చేశామని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. 19 లక్షల మంది సీఎం అభ్యర్ధిపై ఫీడ్బ్యాక్ను ఇవ్వగా వీరిలో 93 శాతం మంది భగవంత్ మాన్ పేరును సిఫార్సు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్, బీజేపీ-పంజాబ్ లోక్ కాంగ్రెస్లు ప్రధానంగా పోటీపడనున్నాయి. ఇక ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.