చండీగఢ్: పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ( Punjab polls ) హీట్ పెరిగిపోయింది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల జంపింగ్లు కూడా దాదాపు నిలిచిపోయాయి. అన్ని పార్టీలు బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. అన్ని పార్టీకంటే ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఆ తర్వాత పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో ప్రజాభిప్రాయ సేకరించి.. వారి అభిప్రాయం మేరకు ఎంపీ భగవంత్ మాన్ను సీఎం క్యాండిడేట్గా ప్రకటించింది.
అయితే, ఇప్పుడు ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయన సంగ్రూర్ జిల్లాలోని ధురి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని ఆప్కు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కానీ, దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా, పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్నాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ, సీఎం అమరీందర్ సింగ్ మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధూవైపు మొగ్గింది. దాంతో అమరీందర్ సీఎం పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం దళితుడైన చరణ్జీత్ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.