పంజాబ్ ప్రజలు ఆమ్ఆద్మీకే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఈ నేపథ్యంలో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని, సీఎం అయినా తాను మాత్రం మామూలు వ్యక్తిలానే ఉంటానని ప్రకటించారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను సీఎం అయినా… నా కళ్లు నెత్తికెక్కవు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కీర్తి ఎప్పుడూ తనలో భాగమేనని చెప్పుకొన్నారు.
తాను ఎప్పటికీ ప్రజల మధ్యనే వుంటానని, ఇప్పటికీ అలాగే ఉంటున్నానని భగవంత్ మాన్ పేర్కొన్నారు. సీఎం అయినా… తన జీవన శైలిలో ఎలాంటి మార్పులూ వుండవని, కొత్త జీవితం వచ్చిందని తాను ఫీల్ కానని అన్నారు. పంజాబ్కు పునర్వైభవం తీసుకొస్తానని, పాత పంజాబ్ తిరిగి రావాలని ప్రజలు కలలు కంటున్నారని, ఆ దిశగానే పనిచేస్తానని భగవంత్ మాన్ హామీ ఇచ్చారు.