న్యూఢిల్లీ : పంజాబ్ సీఎం అభ్యర్ధి పేరును ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ప్రకటించనుంది. పంజాబ్ పర్యటన సందర్భంగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రేపు పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్ధి పేరును ప్రకటిస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కేజ్రీవాల్ మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు మొహాలీలో జరిగే విలేకరుల సమావేశంలో కీలక నిర్ణయం వెల్లడిస్తారని తెలిపాయి.
పార్టీ సీఎం అభ్యర్ధి పేరును ప్రతిపాదించాలని కోరుతూ ఆప్ ఇటీవల ఓ మొబైల్ నెంబర్ను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ నెంబర్ ద్వారా ప్రజలు తమ ఫీడ్బ్యాక్ను అందించాలని కోరింది. 96 గంటల్లో 19 లక్షల మంది నుంచి ఫీడ్బ్యాక్ పార్టీకి అందిందని ఆప్ నేత హర్పాల్ సింగ్ చీమా తెలిపారు.
వీటిలో 6.5 లక్షల స్పందనలు వాట్సాప్ నుంచి రాగా, 2.25 వాయిస్ మెసేజ్లు, 8 లక్షల వాయిస్ కాల్స్ వచ్చాయని చెప్పారు. సీఎం అభ్యర్ధి రేసులో ఎంపీ, పంజాబ్ ఆప్ చీఫ్ భగవంత్ మాన్ ముందువరసలో ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.