చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ( Punjab Polls ) సన్నాహాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతున్నది. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీజేపీ కంటే కూడా ఆప్ దూకుడుగా దూసుకెళ్తున్నది. ప్రచారంలోనూ ఆప్ జోరు పెంచింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీపడనున్న అభ్యర్థుల ఎంపికను కూడా చకచకా పూర్తిచేస్తున్నది.
ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లతో నాలుగు దఫాల్లో నాలుగు జాబితాలను విడుదల చేసింది. తాజాగా 15 మంది అభ్యర్థుల పేర్లతో ఐదో జాబితాను కూడా వెల్లడించింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ సొంత నియోజకవర్గమైన శ్రీ చామ్కౌర్ సాహిబ్ నుంచి ఆప్ తరఫున పోటీకి డాక్టర్ చరణ్జీత్ సింగ్ పేరును ఖరారు చేసింది. కాగా, పంజాబ్లో మరో రెండు లేదా మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.