న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించగా ఇప్పుడీ అంశం హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి పౌరస్మృతిని (Uniform Civil Code) ముందుగా హిందువులకు వర్తింప చేయాలని విపక్షాలు పట్టుబట్టగా తాజాగా ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పందించింది. యూసీసీ అమలు చేసే ముందు అన్ని మతాల ప్రతినిధులు, రాజకీయ పార్టీలతో విస్తృతంగా చర్చించాలని ఆ పార్టీ స్పష్టం చేసింది.
తాము యూసీసీకి మద్దతిస్తామని, అయితే దీనిపై ఏకాభిప్రాయం అవసరమని ఆప్ కార్యదర్శి సందీప్ పాఠక్ తేల్చిచెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా నిర్ధేశిస్తోందని అన్నారు. ఎన్నికలు ముంచుకొచ్చిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సున్నితమైన, వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తాయని పాఠక్ పేర్కొన్నారు. యూసీసీ అమలు పట్ల కానీ, పరిస్ధితిని చక్కదిద్దడం పట్ల కానీ కాషాయ పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదని ఆప్ నేత మండిపడ్డారు.
గందరగోళ వాతావరణం సృష్టించి సమాజంలో చీలిక తేవడం ద్వారా ఎన్నికల్లో పోరాడవచ్చనే ఆరాటమే బీజేపీలో కనిపిస్తుందని దుయ్యబట్టారు. ఈ తొమ్మిదేండ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఏమైనా పనులు చేసి ఉంటే ఎన్నికల్లో అది కాషాయ పార్టీకి కలిసివచ్చేదని, కానీ ఆయన ఏ పనీ చేయనందునే యూసీసీ ఊతంతో ఎన్నికల్లో గట్టెక్కాలని మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Read More :
Trains cancelled | ప్రయాణికులకు గమనిక.. మూడురోజులపాటు బహనాగ బజార్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు