ముంబై: తిరిగి రావాలనుకునే వారు రాచ్చని ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన నేత ఆదిత్య ఠాక్రే పిలుపునిచ్చారు. వారికి పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు సందేశం ఇచ్చారు. కాగా, అసలైన శివసేన కోసం ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం మధ్య పోరు జరుగుతున్నది. తమ మెజార్టీలను వెల్లడించాలని ఇరు వర్గాలను ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు కలిసే అవకాశముందా? అని ఆదిత్య ఠాక్రేను మీడియా అడిగింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘మాకు ద్రోహం చేసి వారి(షిండే వర్గం)తో చేరిన వారికి ఇప్పటికే ఒక విషయం చెప్పాను. మీరు తిరిగి రావాలనుకుంటే రావచ్చు. పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని అన్నారు. అయితే రెబల్ నేతలతో తాము టచ్లో లేమని, కేవలం ప్రజలతోనే ఉన్నామని తెలిపారు.
కాగా, సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపైనా ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఆ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకమని విమర్శించారు. షిండే ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు.