ముంబై : ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉంచాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో కోరారు. రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని తగ్గించడంతో పాటు, వ్యాక్సిన్ ఇచ్చేందుకు అర్హుల వయో పరిమితిని కూడా 15 ఏండ్లకు తగ్గించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
కొవిడ్-19 పరిస్ధితిని నిశితంగా పరిశీలించిన వైద్య నిపుణుల సూచనల మేరకు వెల్లడైన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఠాక్రే పేర్కొన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి మూడవ డోసు ఇవ్వాలని కోరారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న సాధారణ ప్రజలకూ బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరారు.
ఇక భారత్లో కరోనా కేసులు 500 రోజుల కనిష్ట స్ధాయికి పడిపోయినా థర్డ్ వేవ్ ముప్పు వేగంగా ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో ప్రబలుతున్న క్రమంలో ఫిబ్రవరి నాటికి భారత్లో రోజుకు లక్ష నుంచి లక్షన్నర కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త హెచ్చరించడం కలకలం రేపుతోంది.